Andhra
శాశ్వత కలెక్టరేట్ ను మార్కాపురం విద్యుత్ సబ్- స్టేషన్ లో కేటాయించాలి.. MPJ డిమాండ్
మార్కాపురం: పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల కోర్కెపై మార్కాపురం నూతన జిల్లాగా ఆవిర్భవించేలా చేసినందుకు ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ..అలాగే మొట్టమొదటి మార్కాపురం శాశ్వత కలెక్టర్ గా ఒక మహిళను కేటాయించినందుకు ప్రభుత్వానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతుందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ తెలిపారు.
ఈ సందర్భంగా యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాల పోరాటం ఫలితంగా ప్రకాశం జిల్లా నుంచి విభజించి మార్కాపురం జిల్లా చేశారని, అయితే కలెక్టర్ కార్యాలయం తాత్కాలికంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కేటాయించిన స్కూల్ భవనంలో ఏర్పాటుచేశారని, ఇందుకు పేద, మధ్యతరగతి ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అక్కడికి రాక పోకలకు రవాణా చార్జీలు చార్జీలు మోపెడై భరించలేకున్నారని, కలెక్టరేట్ శాశ్వత భవనాలు తర్లుపాడు రోడ్డుపై పట్టణానికి దగ్గరలో, ప్రజలకు అందుబాటులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను కేటాయించాలని ప్రజలంతా కోరుతున్నారని ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో ఆయన పేర్కొన్నారు.
అలాగే HDFC బ్యాంకు ఎదురుగా ఉన్న ఈ విద్యుత్ సబ్ – స్టేషన్ ఒకప్పుడు మార్కాపురం పట్టణానికి పొలిమేరలో ఉండేదని, కానీ ఇప్పుడు పట్టణానికి నడి మధ్యలో ఉండి, వీటి యొక్క 11కెవి విద్యుత్ లైన్లు ఇండ్ల మీదుగా పోవడం, అవి తగిలి చాలామంది ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు అవిటి వారు కావడం జరగటం నిత్య తంతుగా మారిందని, దీంతో స్థానిక ప్రజలు ఈ విద్యుత్ స్టేషన్ ఇక్కడ నుండి తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించాలని పలుసార్లు నిరసనలు తెలియజేశారని అన్నారు.
జిల్లా నాలుగు మూలల నుంచి వచ్చే ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల అభిష్టం, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సబ్ -స్టేషన్ స్థలంలో నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రభుత్వ పాలన యంత్రాంగం అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఎం విజయ సునితకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యంపీజే మార్కాపురం పట్టణ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి, షేక్ అబ్బాస్, కార్యవర్గ సభ్యులు షేక్ జవాద్, షేక్ నూర్ ముహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
![]()
