Andhra
మార్కాపురం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తూట్లు.. అభివృద్ధిలో వెనుకబడే ప్రమాదం –డా. షేక్ మహబూబ్ వలి
మార్కాపురం: ఎన్నికల సమయంలో ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక నాలుగు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేసి పశ్చిమ ప్రకాశం ప్రజలకు అన్యాయం చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి విమర్శించారు.
నల్లమల అటవీ ప్రాంతంతో పరిమితమైన ఈ జిల్లాకు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రవాణా వసతులు లేకపోవడంతో 28 జిల్లాల్లో GDDPలో వెనుకబడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మార్కాపురానికి సమీపంలో ఉన్న దొనకొండ మండలంలో 54 వేల ఎకరాల ప్రభుత్వ భూములు, బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ ఉన్నా, ఆ ప్రాంతాన్ని జిల్లాలో చేర్చకపోవడం వల్ల జిల్లాకు వచ్చే ఆదాయ అవకాశాలు కోల్పోయినట్టయ్యిందన్నారు.
ప్రజలకు వైద్య సేవల కోసం ఆశగా ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని PPP విధానంలో ప్రైవేటు చేతులకు అప్పగించడం బాధాకరమని, అలాగే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని జిల్లాలో కలపకపోవడం చారిత్రక తప్పిదమని,తలలేని మొండంలా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధి అవకాశాలు దూరం చేశారని, ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయకపోతే ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోలేరని హెచ్చరించిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి.
![]()
