Andhra
మోడీ ప్రభుత్వ పుష్కర కాలంలో దేశంలో విధ్వంసం..జి ఈశ్వరయ్య
మార్కాపురం: గతంలో ఎన్నడు లేని విధంగా మోడీ ప్రభుత్వ పుష్కర కాలంలో దేశంలో విధ్వంసం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు.
శుక్రవారం స్థానిక ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూన్నాయని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్లాక్ మార్కెట్ విస్తరిస్తున్నా, దాన్ని నియంత్రించడంలో పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు.
గత పన్నెండు సంవత్సరాల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొంటూ, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న పొదుపు చర్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం సాధించిన పొదుపు ఎంత అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని కోరారు.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు నిర్వహించాలని సీపీఐ నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 28న భగత్సింగ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మార్కాపురం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీనియర్ నాయకులు అందే నాసరయ్య, మార్కాపురం నియోజకవర్గ పార్టీ కార్యదర్శి షేక్ కాసిం మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
![]()
