Andhra
బాలినేనిపై బాల నాగేంద్ర వ్యాఖ్యలను ఖండించిన ఇమ్మడి కాశీనాధ్..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం స్థానిక ప్రెస్క్లబ్ నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మీడియా సమావేశం నిర్వహించి, పార్టీకి చెందిన ప్రచార కోఆర్డినేటర్గా ఉన్న జడ బాలనాగేంద్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ.. ఇటీవల ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో బాల నాగేంద్ర, మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశంసించిన బాల నాగేంద్ర, కొద్ది రోజుల్లోనే తన వైఖరిని మార్చుకోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎవరో ప్రభావం వల్ల లేదా ఇతర ప్రయోజనాల కోసం ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారనే సందేహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా, జనసేన పార్టీకి ఇటీవల కొత్త ఉత్సాహం వచ్చిందని, ముఖ్యంగా ఒంగోలు మరియు పశ్చిమ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్గ దర్శకత్వంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని, కార్యకర్తల మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కొంతమంది ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని, బాల నాగేంద్రను ఉద్దేశించి, “మీరు గతంలో పార్టీకి సేవ చేసిన వ్యక్తి కానీ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని, డబ్బు కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఈ విధంగా వ్యవహరించకండి” అని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం గమనిస్తున్నదని, తప్పు చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని, పార్టీ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు విజయరావు నరసింహరావు, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, మార్కాపురం ఏఎంసీ డైరెక్టర్ పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు మండ్ల వెంకటయ్య, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, ఉమ్మడి రవీంద్ర, కంబం వెంకట రమణ, బెల్లంకొండ గోపి, ఎం.ఎన్. రెడ్డి, కృష్ణవేణి, వాసవి ప్రియ, మట్టం శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
