Connect with us

Andhra

కిట్స్‌లో క్షయవ్యాధి అవగాహన కార్యక్రమం..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) లోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్య శాఖతో కలిసి“క్షయవ్యాధి (టిబి) అవగాహన కార్యక్రమంను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కృష్ణ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ప్రముఖ ఆరోగ్య అధికారులు ఎ. కోటేశ్వరరావు (పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్‌మెంట్–PPM), ప్రభుత్వ ఆసుపత్రి, ఒంగోలు, పి. గోవిందరాజులు (సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్–STS), ప్రభుత్వ ఆసుపత్రి, మార్కాపురం, మరియు ఎన్. రమణబాబు (సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్–STS), దోర్నాల గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఏ. కోటేశ్వరరావు మాట్లాడుతూ, క్షయవ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాని జీవాణు మూలం, వ్యాధి వ్యాప్తి మార్గాలు, మరియు ప్రాథమిక జాగ్రత్తలు గురించి వివరించారు. ఆయన క్షయవ్యాధి అనేది చికిత్స చేయదగిన వ్యాధి అని, ప్రజలలో సరైన అవగాహన ఉంటే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.

పి. గోవిందరాజులు తమ ప్రసంగంలో క్షయవ్యాధి యొక్క లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత చికిత్స విధానాలు (DOTS – Directly Observed Treatment Short Course) గురించి వివరించారు. ఆయన, రోగులు చికిత్స మధ్యలో ఆపకుండా పూర్తి చేయడం చాలా అవసరమని విద్యార్థులకు తెలియజేశారు.

ఎన్. రమణబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేపడుతున్న జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP) లో యువత పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. NSS వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురాగలరని అన్నారు.

డా. కృష్ణ రెడ్డి ప్రిన్సిపాల్, కిట్స్ మాట్లాడుతూ, ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులకు అందించిన విలువైన సమాచారానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య అవగాహనతో పాటు సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాసేవా భావనను పెంపొందిస్తాయని అన్నారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.వి.అనిల్ కుమార్, యూనిట్ సభ్యులు, విద్యార్థి వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రశ్నోత్తరాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యతా భావం, మరియు ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంచిందని నిర్వాహకులు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.