Andhra
కార్మిక నేత పి అమీరుల్లా ఖాన్ కు ఘన నివాళి..
మార్కాపురం: గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, ప్రస్తుతం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా, మోటార్ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐటియుసి) అధ్యక్షులుగా తుది శ్వాస వరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పఠాన్ అమీరుల్లాఖాన్ అని టీడీపీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం ఆయన సేవలను కొనియాడారు.
స్వర్గీయ అమీరుల్లా ఖాన్ సంతాప సభ ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక పూల సుబ్బయ్య శాంతి భవన్ లో జిల్లా కార్యదర్శి ఎస్ కె. కాసిం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనాల మాట్లాడుతూ అమీరుల్లా ఖాన్ తన రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజల మధ్యన జీవించారని అన్నారు.
మోటార్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అందే నాసరయ్య మాట్లాడుతూ అమీరుల్లా ఖాన్ నిరంతరం కార్మిక పక్ష పాతీగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించారని అన్నారు. సంతాప సభకు అధ్యక్షత వహించిన ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్ కె. కాసిం మాట్లాడుతూ కార్మిక నేత అమీరుల్లా ఖాన్ లేని లోటు పూడ్చలేనిదని, అయినప్పటికీ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సంతాప సభ ప్రారంభానికి ముందు టీడీపీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం, ఏఐటియుసి నాయకులు అందె నాసరయ్య, రైల్వే డి ఆర్ సి సి మెంబర్ గాయం నారాయణ రెడ్డి, ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కె జీ నరసింహం మరియు నాయకులు అమీరుల్లా ఖాన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అమీరుల్లా ఖాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![]()
