Andhra
మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతు సంఘం ధర్నా..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం రెవిన్యూ డివిజన్లో వేలాది ఎకరాల్లో రైతులు విరివిగా పత్తి పండించడం జరిగిందని, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలలో ప్రైవేటు పత్తి వ్యాపారులు ప్రవేశించి కారు చౌకగా రైతుల నుండి పత్తిని కొనుగోలు చేయడం ఆందోళన కలిగించే అంశమని, వెంటనే మార్కాపురం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆవరణలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ.. పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్థ తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభమైందని మే నెల నుండి పత్తి పంట దిగుబడి ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి క్వింటాలు ధర 8110 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఒక క్వింటా కూడా ఇప్పటికీ రైతుల నుండి కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించి ప్రైవేటు వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో రవీంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మార్కాపురం మండల కార్యదర్శి గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తర్లు పాడు మండల రైతు సంఘం కన్వీనర్ ఏరువ పాపిరెడ్డి, పెద్దోర్నాల రైతు సంఘం మండల కార్యదర్శి దుర్గంపూడి తిరుపతిరెడ్డి, రైతులు బానోతు లక్ష్మీ నాయక్, కాశిరెడ్డి, వెంకటరమణ బాబు, ఎన్ నాగేశ్వరరావు, ఓర్సు వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.*
![]()
