Andhra
అయోధ్య మసీదు నిర్మాణానికి అడ్డుపడుతున్న ప్రభుత్వ యంత్రాంగం..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాను అయోధ్య డవలప్మెంట్ అథారిటీ (ADA) తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిని సున్నీ సెంట్రల్ వర్ఫ్ బోర్డుకు యూపీ ప్రభుత్వం అప్పగించింది.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) కింద పాత్రికేయుడు ఓం ప్రకాష్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఏడీఏ సెప్టెంబర్ 16న సమాధానం ఇచ్చింది. మసీదు ట్రస్టు 2021 జూన్ 23న అప్లికేషన్ పెట్టుకుందని, అయితే వివిధ శాఖల నుంచి క్లియెరెన్స్ లేకపోవడంతో దానిని తిరస్కరించామని తెలిపింది. ప్రజాపనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సర్వీసు నుంచి అనుమతులు పొందలేదని తెలిపింది.
అయోధ్య డవలప్మెంట్ అధారిటీ నిర్ణయంపై మసీదు ట్రస్టు సెక్రటరీ అథర్ హుస్సేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మసీదు నిర్మాణానికి భూమి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని, అయితే ప్రభుత్వ శాఖలు ఎందుకు నో-అబ్జెక్షన్ ఇవ్వలేదో, మసీదు ప్లాన్ను అధికార యంత్రాంగం ఎందుకు తోసిపుచ్చిందో అర్థం చేసుకోలేకున్నామని అన్నారు.
![]()
