Connect with us

Andhra

పచ్చని పంటపొలాలను కార్పొరేట్ ధారదత్తం చేయడం ప్రభుత్వానికి తగదు.. వెల్ఫేర్ పార్టీ, యంపీజే

Published

on

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తలపెట్టిన స్వయం సమీకృత సౌర పలకల తయారీ పరిశ్రమ (వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్, కోసం ప్రభుత్వం సుమారుగా 8500 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే సుమారుగా 4500 ఎకరాల సేకరణకి సంబంధించి, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, ప్రాథమిక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే స్థానికులు, గ్రామస్తులు ఈ పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనోపాధికి ఆధారమైన పచ్చని పంట పొలాలను కంపెనీ కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే గ్రామసభలను అడ్డుకున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా నేపథ్యంలో వారికి సంఘీభావంగా వెల్ఫేర్ పార్టీ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్, MPJ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ లు కరేడు గ్రామ రైతులను కలవడం, పోలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండోసోల్ సోలార్ సంస్థ 69,000 కోట్ల పెట్టుబడితో ‘క్వార్ట్జ్ నుండి మాడ్యూల్’ పద్ధతిలో మొత్తం పలకల తయారీ ఇక్కడే చేస్తామని చెప్పి మొదట్లో తాము 10 గిగావాట్ల పలకలు తయారు చేస్తామని, అందుకుగాను తమకి 5,148 ఎకరాలు రామాయపట్నంలో కావాలి అని, వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అవసరం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి, వాటి కండిషన్స్ ను ప్రభుత్వం అన్నిటికీ ఒప్పుకుందని, అయితే ప్రభుత్వం మారాక 2025లో తమకి రామాయపట్నం బదులు కరేడులో భూములు ఇవ్వమని, ఉత్పత్తి సామర్థ్యం కూడా 10 గిగావాట్ల నుండి 20 గిగావాట్లకు పెంచుతామని మొత్తం ఏడు దఫాలలో సెప్టెంబర్ 2028 నాటికి పరిశ్రమను నిర్మిస్తామని పేర్కొని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 20 గ్రామాలలో మొత్తం అవసరాలకు 23 వేల ఎకరాల భూమి కావాలని అడగడం, అందులో ఒక్క నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని, గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలోను 8,462.5 ఎకరాలు; ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం సింగరాయకొండ, బింగినపల్లి గ్రామాలలో మిగతా భూమి అడగడం, వెంటనే ప్రభుత్వం ఒప్పేసుకోవడం దుర్మార్గం. ఈ పరిశ్రమకి మూడు వేల ఎకరాలే ఎక్కువని, వారి, కూరగాయలు తదితర పంటలు పండే పచ్చని పోలాలను ప్రైవేటు కంపేనీలకు ధారాదత్తం చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి రైతులకు సంఘీభావం తెలిపి, కర్నాటక రాష్ట్రంలో దేవానహళ్లిలో 1800 వందల ఎకరాలు గత బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ముట్ట చెప్పిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని క్యాబినెట్ రైతుల ఉద్యమాన్ని తలొగ్గి డీనోటిఫై చేసి రద్దు చేసిందని, అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని రద్దుచేసి బంజరు భూములను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంపీజే ప్రకాశం జిల్లా అద్యక్షులు షేక్ ఖాసిం, ఏఐయుఎమ్ఎల్ నెల్లూరు నాయకులు ఎమ్ హసన్ బేకింగ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.