Andhra
పొదిలి వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించండి.. లేదంటే ఉద్యమం చేపడతాం..SDPI అబ్దుల్ సత్తార్
ఒంగోలు: ప్రకాశం జిల్లా పొదిలి వక్ఫ్ భూముల ఆక్రమణల గురించి అధికారుల నుండి న్యాయం జరగడం లేదని పొదిలి ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ తో కలిసి ముస్లిమ్ పెద్దలు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు కి కలెక్టరేట్ లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డీ ఆర్ ఓ స్పందిస్తూ వక్ఫ్ స్థలాలలో ముస్లిమేతరులు ఉండరాదని, వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చివున్నామని, ఆదేశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. ముస్లిమ్ స్థలాల్లో ముస్లిమేతరులు ఆక్రమించి అనుభవించడం ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని, వక్ఫ్ భూముల విషయంలో రెవెన్యూ, పోలీసు శాఖలు లోపాయికారిగా వ్యవహరిస్తున్నారని, వక్ఫ్ భూ ములను కాపాడవలసిన వక్ఫ్ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించక పోతే ఉద్యమాల బాట పడతామని జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలి మండలంలోని వక్ఫ్ భూములలోని ఆక్రమణలను తొలగించి, వాటికి కంచె ఏర్పాటు చేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉమర్, మదార్ వలీ, ఖాదర్ భాష, ఖలీల్ , మహబూబ్, మజహర్, యాసిన్ సందాని తదితరులు పాల్గొన్నారు,
![]()
