Andhra
ఇంకా దళితులు అంటే చిన్నచూపే
మంగళగిరి పట్టణ బిజెపి అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు భార్య ప్రీతి తీరుపై దళిత మహిళలు, పలు సంఘాల నాయకులు శుక్రవారం నార్త్ సబ్డివిజన్ డిఎస్పి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు..మంగళగిరి కుప్పురావు కాలనీ 11వ లైన్ పద్మశాలీయ బజార్లో 25సంవత్సరాలుగా దళిత దంపతులు రాధా, వెంకటేశ్వరరావు నివశిస్తున్నారు. రాధా ఇంటి ఎదురుగా ఉన్న ప్రీతి గత కొంతకాలంగా రాధా, వారి మనవళ్లను కులం పేరుతో దూషిస్తూ వస్తున్నారు. చిన్న పిల్లలు ఆమె ఇంటి వైపు వెళ్లితే మైల పేరుతో రహదారిపై పసుపు నీళ్లు చల్లుతున్నారు.ప్రీతిపై కేసు నమోదు చేయాలని డిఎస్పి మురళీకృష్ణను ఎమ్ఆర్పిఎస్ నాయకులు చందోలు విక్టర్పాల్, కలకొటి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంతేటి సాగర్ డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రీతిపై గత నెల 25న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ విచారణ చేపట్టారు. విచారణ నత్తనడకన సాగడంతో ఎస్సి, ఎస్టి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రీతిపై ఎస్సి, ఎస్టి కేసు నమోదు చేశారు.
![]()
