Andhra
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో 18న ధర్నా – CPI జిల్లా కార్యదర్శి నారాయణ..
మార్కాపురం: అట్టడుగు వర్గాల విద్యార్థులకు, ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 18న మెడికల్ కాలేజీ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. జిల్లా సీపీఐ కార్యవర్గ సమావేశం సోమవారం సాయంత్రం స్థానిక పూలసుబ్బయ్య శాంతి భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చి మరింత సేవలు అందించాల్సిన పాలకవర్గాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కళాశాలలను కొంతమంది కాంట్రాక్టర్లకు దారాదత్తం చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మెడికల్ కాలేజీని, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన నూతనంగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న దర్శి నియోజకవర్గాన్ని, శ్రీశైలం మండలాన్ని కలపాలని కోరుతూ ఈ నెల 15వ తేది సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరావు, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెవి కృష్ణగౌడ్, ఎస్ కె యాసిన్, నాయకులు డి. శ్రీనివాస్, అందె నాసరయ్య, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి ఎన్కి కాశిం, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![]()
