India
విజయ్ సభ తొక్కిసలాట విషాదం..39 మంది మృతి..50 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులోని కరూర్లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటుచేసుకుని ఎనిమిది మంది చిన్నారులు, 16 మందితో సహా 39 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలో 39 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంతాపం ప్రకటించారు. తన సభలో ప్రాణనష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. నా హృదయం ముక్కలైంది; చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంలో నేను విలవిలలాడుతున్నాను. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాని చెప్పారు.
![]()
