India
దేశ వ్యాప్తంగా 334 పార్టీలను రద్దు చేసిన ఈసి..
ఢిల్లీ: ఎన్నికల సంఘం దేశంలో గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేండ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ.. వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపుపొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఎన్నికల సంఘం డీలిస్ట్ చేసిన రాజకీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 18 పార్టీలు ఉన్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 13 పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి. ఆరు జాతీయ పార్టీలివే..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీపీఐ(ఎం), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ).
![]()
