India
తిండి లేక కుమారుడు మృతి.. డబ్బులేక శ్మశానంలో ఏడుస్తూ తండ్రి
TG: మానసిక వైకల్యంతో ఉన్న కొడుక్కి కనీసం తిండి లేక అనారోగ్యం పాలై మృతి చెందగా.. కొడుకును పూడ్చి పెట్టేందుకు డబ్బులు లేక శ్మశానంలో గంటల తరబడి కొడుకు మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ గడిపాడు ఓ తండ్రి.
ఈ హృదయ విదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబనగర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రేమ్నగర్కు చెందిన బాలరాజ్ పత్తిమిల్లులో పని చేస్తూ ఉండేవాడు. ఏడాది పాటు మిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి.
కొద్దిరోజుల క్రితం భార్య చిన్నకుమారుడిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మానసిక వైకల్యంతోపాటు, వికలాంగుడైన పెద్ద కుమారుడు హరీష్(8)కి డబ్బులు లేకపోవడంతో ఇటీవల హోటల్ క్లీనింగ్ పనిలో చేరాడు. అయితే వచ్చే అరకొర డబ్బులు, మందులకు, తిండికి సరిపోక.. హరీష్ తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం ఉదయం మృతి చెందాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో.. మృతదేహాన్ని భుజాన వేసుకొని ప్రేమ్ నగర్ శ్మశానవాటికకు వెళ్లి ఏం చేయాలో తెలియక అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు.
ఇలా దాదాపు 5 గంటలపాటు సహాయం కోసం ఎదురు చూసిన తరువాత చీకటి పడుతుండగా.. స్థానికులు గమనించిన జడ్చర్లకు చెందిన వీఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు చేరుకొని పొక్లెయిన్తో గుంత తీయించి హరీష్ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే గత 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు మాత్రమే తాగుతున్నామని, ఆకలి బాధ తాళలేక కుమారుడు మరణించాడని, తనకు కామర్లు సోకి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో స్థానికులు కంటతడి పెట్టారు.
![]()
